మా ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారు: పళనిస్వామి
- అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ టీవీకే ప్రభుత్వం
- తమ ఎమ్మెల్యేలను విజయ్ ప్రలోభపెట్టారన్న పళనిస్వామి
- తాము స్వచ్ఛందంగానే విజయ్కు మద్దతు ఇస్తున్నామన్న అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణి
తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం అధికారికంగా ప్రారంభమైంది. ఊహించినట్లుగానే, ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవలం 22 మంది మాత్రమే వ్యతిరేకించారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ముఖ్యంగా, అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు విజయ్కు అండగా నిలవడంతో ప్రభుత్వం సుస్థిరమైంది. బలపరీక్షకు ముందు డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.
మరోవైపు, బలపరీక్షకు ముందు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి మాట్లాడుతూ... విజయ్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, డబ్బు ఆఫర్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను విజయ్ కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ పార్టీ ఐక్యంగానే ఉందని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం మరోలా వచ్చింది.
పళనిస్వామి వ్యాఖ్యలను రెబల్ నేత వేలుమణి తీవ్రంగా ఖండించారు. తామంతా స్వచ్ఛందంగానే విజయ్కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేస్తూ, పళనిస్వామి నాయకత్వంపై తమకు నమ్మకం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. తమకు మంత్రి పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, రెబెల్ ఎమ్మెల్యేల తరపున సభలో వేలుమణి మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు యత్నించారు.